చలం గారి మైదానం ప్రభావం (నాకర్ధమైనంత)


ఉపోద్ఘాతం

దాదాపు వందేళ్ల క్రితం 1927లో రాసిన నవల గురించి సాహిత్యాభిమానులు ఇంకా మాట్లాడుకోవడం వింటూ వుంటే ఆశ్చర్యమేస్తుంది. అంతగా ఏం వుంది అందులో అనే ప్రశ్న చాన్నాళ్లు వెంటాడగా మొత్తానికి పోయినేడు బుక్ ఫెయిర్ లో మైదానం కొనేశాను. ఇంతా చేస్తే ఓ వంద పేజీల పుస్తకం అది. కానీ అప్పటి సాహితీలోకంలో అది పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. 

1927 నాటి సాంఘిక స్థితిగతుల మీద మనకి అవగాహన పెద్దగా ఉండదు కాబట్టి వాటిగురించి మాట్లాడడం వుపయోగం లేదు. అయితే, సమకాలీన సాంఘిక పరిస్థితులమీద ఆనాటి (విప్లవ?) రచయితల ప్రభావం ఎంతైనా వుంది. మైదానం చదివేశాక దీని మీద ప్రముఖంగా వచ్చిన విశ్లేషణలు, చర్చలు గురించి కూడా చదవాలనిపించి వెదికితే 'జయప్రభ గారి'  పోస్టు కనబడింది. చక్కని విశ్లేషణ; అంతకంటే ముఖ్యంగా సమకాలీన రచయితలు మైదానంకి వ్యతిరేకంగా రాసిన పుస్తకాల గురించి కూడా చర్చించారు. అయితే ఆ రచయితలు విశ్వనాథ సత్యనారాయణ (చెలియలికట్ట), త్రిపురనేని గోపీచంద్ (గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, గతించని గతం) గార్లు కావడం ఆశ్చర్యం కలిగించింది. మైదానం యొక్క (దుష్?)ప్రభావం గురించి ఎంత భయపడి ఉండకపోతే వీరు ఈ పుస్తకాలు రాస్తారు?

స్థూలంగా, ఈ రచనలో నాకు రెండు విషయాలు ప్రస్ఫుటంగా గోచరించాయి.

1. వాంఛ:

ఆశ, వ్యామోహం, కోరిక, లేదా వాంఛ అనేవి చాలా బలమైన భావాలు. వాటి ఉధృతిని తట్టుకోలేక ఆ బలహీనమైన క్షణంలో తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాలు జేమ్స్ హాడ్లీ ఛేజ్ నవలల్లో చాలా బాగా వివరిస్తాడు. ఇక్కడ కూడా, కథానాయిక తన శారీరక వాంఛలు అరమరికలు, అడ్డంకులు, అవాంతరాలూ లేకుండా తీర్చుకోడానికి తను మోహించిన వాడితో వెళ్ళిపోతుంది. గమనిస్తే అప్పటికే అతనితో తెరచాటుగా సంబంధం నడిపిస్తూ వుంటుంది. కానీ అలా చాటుగా అనుభవించడం ఆమెకి నచ్చదు. తన మోహం తప్పు కాదు అదే అమరత్వం దివ్యత్వం అనే భావన ఆమెలో వుంటుంది. దానికే ప్రేమ అనే పేరు పెట్టుకుంటుంది. సమాజం ఏమన్నా, ఏమైపోయినా ఫర్వాలేదు అనే తెగింపుతో భర్త నుంచి, ఇంటినుంచి వచ్చేస్తుంది.

 ఇది చదివినప్పుడు జేమ్స్ హాడ్లీ ఛేజ్ ప్రభావం చలం మీద వుందా లేదా చలం ప్రభావం  జేమ్స్ హాడ్లీ ఛేజ్ మీద వుందా అనే అనుమానం వచ్చింది. బహుశా ఏమీ ఉండకపోవచ్చు. ఇద్దరూ సమకాలీనులు అవ్వడం ఆ అనుమానానికి ఊతమిచ్చింది. ఈ 'వాంఛ యొక్క బలం' కోణంలో చూసినప్పుడు జేమ్స్ హాడ్లీ ఛేజ్ రచనలే బెటర్ అనిపించాయి. ఎందుకంటే ఛేజ్ తన పాత్రలని అనలైజ్ చేయడు, ఆ పాత్రలు నీతులు చెప్పవు. తాము చేసేది తప్పో ఒప్పో నిజాయితీగా చేసేస్తాయి, ద్వైదీభావం వుండదు. సమాజం యొక్క అప్రూవల్ కోసం పాకులాడవు. చలం పూర్తిగా తన ప్రొటాగనిస్ట్ చర్యలని సమర్ధించుకునే పనిలోనే వుంటాడు. ఆ వాదనలో డొల్లతనం కూడా తానే బయటపెడుతూ వుంటాడు. కోరికలు మొహమాటం లేకుండా పూర్తిగా తీర్చుకోవడమే ముఖ్యం అనుకున్నప్పుడు మీరా పాత్ర ప్రవేశంతో అంత అయోమయం ఎందుకు? అమీర్ కి ఒప్పైనప్పుడు రాజేశ్వరికి తప్పెందుకవుతుంది. చలం అక్కడ ఎందుకు భయపడ్డాడు?

2. మేరా అబ్దుల్ అలగ్ హై:

ఇది కొంచెం వింత వాదనలాగా బోడిగుండుకీ మోకాలికీ మెలిక పెడుతున్నట్టు వుండొచ్చు, కానీ చదవండి. తురక వాళ్ళు (ఈ పుస్తకంలో అలాగే సంబోధిస్తారు) మొరటుగా వుంటారు, బలంగా వుంటారు, వాళ్ళతో శృంగారం మోటుగా వుంటుంది లాంటివి కొన్ని దశాబ్దాలుగా సటిల్ గా ఇండ్యూస్ చేశారు. చలం లాంటి రచయితలు కూడా అదే కోవకి  చెందినట్టు అగుపిస్తుంది. అమీర్ ఒక డౌన్ ట్రాడన్ వ్యక్తి, ఏ మాత్రం సున్నితత్వం వుండదు, నచ్చింది ఎలాగైనా దక్కించుకునే తత్త్వం, అలాగే కోపం వస్తే నిర్ధాక్షిణ్యంగా చితకబాదడం. ఈమంటే ప్రేమ అంటూనే మరొక స్త్రీ పొందు కోసం వ్యాకుల పడటం, తనకి నచ్చినట్టు నడచుకోవడంలేదని గర్భవతి అనికూడా చూడకుండా వదిలేసిపోవడం. విచిత్రమేంటంటే, అన్ని లా పాయింట్లు మాట్లాడి, భర్త, బంధువుల ఆచార వ్యవహారాలని విమర్శించి తూలనాడిన రాజేశ్వరి (కధానాయిక) అమీర్ ఇన్ని బాధలు పెట్టినా పెద్ద మనసుతో క్షమించేస్తుంది. వాడు వేరే అమ్మాయిని మోహిస్తున్నాడని తెలిసి వెంటబెట్టుకుని ఆమె దగ్గరికి తీసుకుపోయి, ఆమెని ఒప్పించి, దగ్గరుండి మరీ వాడి కోర్కెని తీరుస్తుంటుంది. ఇక్కడ చలం దిగజారిపోయాడా, ఆ పాత్ర దిగజారిపోయిందా లేదా ఇద్దరిలో క్లారిటీ అఫ్ థాట్ కొరవడిందా స్పష్టంగా వుండదు.

శారీరక సుఖమే అంతిమ లక్యం అయినప్పుడు అమీర్ దగ్గర బానిసలా పడి వుండేకన్నా మీరాతో వెళ్లిపోవచ్చు లేదా తనని వదిలేసిన తరువాత మరో నచ్చిన మొగాడిని చూసుకోవచ్చు. కానీ అలా చేయదు, అమీర్ తో తనది ప్రేమ అనే సంశయంలో పడి వాడికోసం వుండిపోతుంది. నిజంగానే ప్రేమేనేమో, మొగాడికి ఎంతమందితో అయినా సంబంధం వుండొచ్చు తనకి వుండకూడదు అని అమీర్ తో వచేశాకా జ్ఞానోదయం అయిందేమో.

ఇప్పటి సమాజం మీద ఇలాంటి రచనల ప్రభావం ఏళ్లతరబడి సటిల్ గా పెరిగి ఇప్పుడు చాలా ప్రమాదకరంగా తయారయ్యింది. గర్భవతి అనికూడా చూడకుండా  కుక్కని కొట్టినట్టు కొడితే "అలా నిస్సంశయంగా కొట్టలేకపోతే అదేమి ప్రేమ" అంటుంది దెబ్బలు తిన్న వీర వనిత. అప్పట్లో ఇలాంటి రచయితలు సెన్సేషన్ కోసమో మరేమైనా కారణాల (లెఫ్ట్ లీనింగ్స్) వలనో నాటిన విష బీజాలు ఇప్పటి apologetic Hindus కి, లవ్ జిహాద్ లకి కారణం. ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టినా సమాజం పెద్దగా స్పందిచకపోవడానికి ఇలాంటి కండిషనింగ్ ఒక రీజన్. ఇంకో అడుగు ముందుకు వేసి ఫ్రిజ్ సంఘటనలో నరికిన వాడిని హిందువుగాను, ముక్కలు అయ్యిన అమ్మాయిని క్రిస్టియన్ గాను చూపిస్తూ ఒక ఛానెల్ (Sony TV?) వెబ్ సిరీస్ చేసింది అంటే ఈ conditioning ఎంత లోతుగా వుందో అర్ధం చేసుకోవచ్చు. వాడు కొడతాడు అని భయపడుతూనే అదే ప్రేమ అని తనని తాను వంచించుకుంటూ, ఇతరులని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఎందుకు బతకడం? ఈ కోణంలో చూస్తే చలం లాంటి (సూడో?) మేధావుల వలన సమాజానికి (ముఖ్యంగా హిందూ సమాజానికి) లాభం ఎంత జరిగిందో తెలీదు కానీ నష్టం మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. 

ముగింపు:

రచన యొక్క లక్ష్యం, ప్రభావం, రచయిత అంతర్గత వుద్దేశం (ulterior motive) పక్కన పెడితే నిస్సందేహంగా గొప్ప రచన. ఆ భావ వ్యక్తీకరణ, భాష, అభివర్ణన అసమాన్యం. లోకం పోకడ మీద తిరుగుబాటు అనేదే నిజమైతే మరొక రకంగా చేసి వుండాల్సింది. లేక నిజంగానే రాజేశ్వరిని అమీర్ తో అష్ట కష్టాలు పడి జీవితం నాశనం చేసుకుంది అనే కోణంలో చూపించాలి అనుకుని వున్నట్లయితే రచయిత లక్ష్యం నెరవేరలేదేమో అనిపిస్తుంది. నాకు అసలు మైదానం అర్ధం కాకపోయి కూడా వుండొచ్చు 😐

Tidbit:
ఈ రచయితల గురించి వెతుకుతుంటే వీళ్ళు సమకాలీనులు అనే విషయం స్ఫురించింది. వీరి జనన మరణ కాలాలు చూస్తే:

గుడిపాటి వెంకట చలం: 18 మే 1894 - 7 మే 1979 
విశ్వనాథ సత్యనారాయణ: 10 సెప్టెంబర్ 1895 - 18 అక్టోబర్ 1976
James Hadley Chase: 24 డిసెంబర్ 1906 - 6 ఫిబ్రవరి 1985
త్రిపురనేని గోపీచంద్: 8 సెప్టెంబర్ 1910 – 2 నవంబర్ 1962

Comments